"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఆంధ్ర విశ్వవిద్యాలయం
దస్త్రం:Andhra university logo.jpg | |
రకం | సార్వత్రిక |
---|---|
స్థాపితం | ఏప్రిల్ 26,1926 |
వైస్ ఛాన్సలర్ | ఆచార్య జి. నాగేశ్వరరావు |
రెక్టర్ | డి.గాయత్రి |
డీన్ | కె.రామమోహన రావు |
స్థానం | విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అనుబంధాలు | యుజిసి |
జాలగూడు | http://www.andhrauniversity.edu.in |
ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.
ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.
తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.
Contents
విశ్వవిద్యాలయ చిహ్నము
- ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహనశాస్త్రి రూపకల్పన చేశాడు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి, చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి "నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి.[1]
ప్రత్యేకతలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశం లోనే మొదటిసారిగా 1934 నుండే కామర్సులో ఆనర్సు డిగ్రీ మొదలుపెట్టింది, 1957లో దేశంలోనే మొట్టమొదటి సారిగా MBA కోర్సును ప్రవేశపెట్టింది.[2]
- ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం).
- మానవ వనరులను, సాఫ్టువేరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మధ్యనే (2008 నుండి) "స్కూల్ ఆఫ్ ఐటి" అనే ఒక సంస్థను నెలకొల్పింది.[3]
ఉపకులపతులు
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
|
కళాశాలలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం కళలు , వాణిజ్యం కళాశాల (Estd. 1931)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల (Estd. 1955)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం స్త్రీల ఇంజనీరింగ్ కళాశాల (Estd. 2010)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల (Estd. 1945)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల (Estd. 1951)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శాస్త్ర , సాంకేతిక కళాశాల (Estd. 1931)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య పాఠశాల (Estd. 1972)
కళా ప్రపూర్ణ
కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది, విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.
ప్రచురణలు
తెలుగు పుస్తకాలు
- పంచమి (రంగనాథ రామాయణాదిక వ్యాసములు) (1954)
- ఎవరెస్ట్ శిఖరారోహణము (1956)
- మానవ వంశావళి (1964)
- రాజశిల్పి (1964)
- శ్రీనివాస కల్యాణము (నాటకము) (1972)
- ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు (1978)
- తెలుగు వ్యుత్పత్తి కోశము (1978-1995)
- కావ్య సమీక్షలు (1983)
- కాదంబరీ స్వాదము (1988)
- ఆదిభట్ట నారాయణ దాస సారస్వత స్వాదము (1992)
- ప్రబంధరత్నాకరము (1992)
- ప్రాణదాత యల్లాప్రగడ సుబ్బారావు జీవిత పరిచయం (1997)
- జ్ఞాపక శక్తి - చదివే పద్ధతులు (1998)
- మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము (2001)
- తెలుగుభాషా తత్త్వం (వ్యాస సంపుటి) (2002)
- వీరేశలింగం (2003)
- ఆంధ్ర విశ్వకళాపరిషత్తు - వ్యావహారిక తెలుగు భాషావ్యాప్తి (2004)
- వెయ్యేళ్ళ తెలుగు వెలుగు (2009)
ఆంగ్ల పుస్తకాలు
- The Simhachalam Temple (1969)
- A Descriptive Catalogue of the Telugu Manuscripts (1999)
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో విశ్వవిద్యాలయ చిహ్నం Archived 2007-05-27 at the Wayback Machine. గురించి వివరిస్తున్న పేజీనుండి మే 21, 2007న సేకరించబడింది.
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో కళలు , కామర్సు కళాశాల పేజి నుండి మే 21, 2007న సేకరించబడింది.
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో స్కూల్ ఆఫ్ ఐటి Archived 2008-05-10 at the Wayback Machine. గురించి. ఏప్రిల్ 23, 2008 న సేకరించబడింది.
![]() |
Wikimedia Commons has media related to Andhra University. |