"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఎం. ఎస్. కె. ప్రసాద్
దస్త్రం:Mskprasadcricketer.jpg | ||||
భారత క్రికెట్ క్రీడాకారుడు మరియు భారత క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | కుడిచేతి వాటం | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్టులు | వన్డేలు | ||
మ్యాచులు | 6 | 17 | ||
చేసిన పరుగులు | 106 | 131 | ||
బ్యాటింగ్ సరాసరి | 11.77 | 14.55 | ||
100s/50s | -/- | -/1 | ||
అత్యధిక స్కోరు | 19 | 63 | ||
బౌలింగ్ చేసిన బంతులు | - | - | ||
వికెట్లు | - | - | ||
బౌలింగ్ సరాసరి | - | - | ||
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | - | |||
మ్యాచ్ లో 10 వికెట్లు | - | n/a | ||
ఉత్తమ బౌలింగ్ | - | - | ||
క్యాచులు/స్టంపులు | 15/- | 14/7 | ||
Source: ESPNCricinfo, 4 ఫిబ్రవరి 2006 |
ఎమ్మెస్కే ప్రసాద్ గా పిలవబడే మన్నవ శ్రీకాంత ప్రసాద్ ఒక తెలుగు క్రికెట్ క్రీడాకారుడు. 2016లో ఇతడు భారత క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]
Contents
నేపధ్యము
ఇతడిది గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడికొండూరు గ్రామం. నాన్న రవిప్రసాద్ గుంటూరులోని కేంద్రప్రభుత్వ రంగసంస్థ లేబొరేటరీలో పనిచేసేవారు. ఇతడికి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. వీళ్ళ ఊళ్లో ప్రతీ మూడిళ్లలో ఒక డాక్టరో, ఇంజనీరో ఉండేవారు. అలానే ఇతడి సోదరుడు ఇంజనీర్ కాగా, సోదరి డాక్టర్. ఇతడి ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లోని కేంద్రీయ విద్యాలయలో పూర్తయింది. గ్రాడ్యుయేషన్ హిందూ కళాశాలలో చేశాడు. పాఠశాల దశలోనే క్రికెట్పై ఆసక్తి కలిగింది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించడంతో గుంటూరు వచ్చి పోలీసు పరేడ్గ్రౌండ్స్లో గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. వికెట్ కీపింగ్ ఇతడికి సహజసిద్ధంగానే అబ్బింది. గుంటూరులో జరిగిన కోచింగ్ క్యాంపునకు తొలిరో జు వెళ్లినప్పుడు సెలెక్షన్సుకు 200 మంది పిల్లలు వచ్చారు. అందులో వికెట్కీపర్ ఇతనొక్కడే. ఆ రోజున కోచ్ ఇతడికి కష్టమైన క్యాచ్ లు ఇస్తుండగా వాటన్నింటినీ ఆరితేరినవాడిలా ఒడిసిపట్టుకొన్నాడు. ఆరోజు నుంచి ఇతడి కోచ్ పూర్ణచంద్రరావు వికెట్ కీపింగ్లో సానపెట్టారు. దాంతో మూడు నెలల్లోనే ఆంధ్ర రంజీ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఇంటర్ జోనల్ మ్యాచ్ లు ఆడే రోజుల్లో గౌరవ కార్యదర్శి ఎన.వెంకటరామ్ ఇతడి ఆటతీరుచూసి ఈ కుర్రాడు ఏరోజుకైనా భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదిస్తాడన్నారు.[2]
క్రికెట్ ప్రస్థానము
వన్డే పోటీలు
ఇతడి కోచ్ తోపాటు స్నేహితులు, కుటుంబసభ్యులంతా ప్రోత్సాహం అందించడంతో క్రికెట్లో ఉన్నతశిఖరాలకు చేరుకోవడానికి బాగా కష్టపడ్డాడు. ఇతడు, ఫాస్టుబౌలర్ అజిత అగార్కర్ పాకిస్థాన్ ఏ టూర్ నుంచి దేశానికి వచ్చారు. ఆ వెంటనే ముక్కోణపు సిరీస్కు అగార్కర్ ఎంపికయ్యాడు. తనకు కూడా పిలుపు వస్తుందని ఎదురు చూశాడు. ఊహించినట్లుగానే 1998లో వికెట్కీపర్ నయన మోంగియా గాయపడటంతో భారతజట్టులో ఆడే అవకాశం లభించింది. కోకాకోలా ముక్కోణపు సిరీస్లో మొహాలీ క్రికెట్ గ్రౌండ్లో బంగ్లాదేశపై వన్డే మ్యాచతో ఇతడి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం ప్రారంభమైంది. అది ఇతడి జీవితంలో మరిచిపోలేని రోజు. అంతకుముందు ఇండియా-ఏ తరపున ఐదువిదేశీ టూర్లలో పాల్గొన్నప్పటికీ తొలివన్డే మ్యాచ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఆ మ్యాచలో ఎక్కడా ఒత్తిడికి గురికాలేదు.[2]
టెస్టు పోటీలు
ఇతడి టెస్టు కెరీర్ ప్రస్థానం న్యూజిల్యాండ్తో ప్రారంభ మైంది. ఆ మ్యాచ్ లో భారతజట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 83పరుగులకే కుప్పకూలింది. ఇతడు ఆ రోజున ఏడో నెంబర్ బ్యాట్స్మెనగా క్రీజులోకి వెళ్లాడు. అప్పటికే 43పరుగులకు ఆరువికెట్లు కోల్పోయింది. ఇతడి ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కర్ క్రీజ్లో ఉన్నాడు. ఆయన మ్యాచ్ లో పరిస్థితి ఎలా చూస్తున్నావని ప్రశ్నించాడు. ఇతడు ఒక్కటే సమాధానం చెప్పాడు. రోజంతా వికెట్ల ఎదుట పాతుకు పోయేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఆ జవాబు ఇతడి నుంచి వచ్చినందుకు సచిన్ సంతోషపడ్డాడు. అయితే కొద్దిసేపటికే సచిన అవుట్కాగా ఆ తర్వాత శ్రీనాథ్, టెయిల్ ఎండర్లు క్యూకట్టారు. దాంతో 16 పరుగులతో నాటౌట్గా మిగిలిపోయాడు.[2]
క్రీడా విరమణ
ఆస్ట్రేలియా టూర్కు వెళ్లేటప్పుడు కౌలాలంపూర్లో సామాను తీసుకుని వెళుతుండగా అది ఇతడి మోకాలుకు కొట్టుకొన్నది. దానిని ఇతడు తేలికగా తీసుకున్నాడు. తీరా ఆస్ట్రేలియా వెళ్లాక చూస్తే నడవలేని పరిస్థితి. బాగా వాపు రావడంతో జట్టు ఫిజియో ఇతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దాంతో నయన మోంగియాను అప్పటికప్పుడు పిలిపించారు. ఆ తర్వాత వన్డే జట్టులో ఇతడు ఉంటానని ఆశించాడు. అయితే ఇతడిని జట్టు నుంచి తొలగించి నట్లుగా కెప్టెన్ చెప్పడంతో షాక్కు గురయ్యాడు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఐదేళ్లపాటు ఆంధ్రా రంజీ జట్టులో ఆడాడు. మళ్లీ జట్టులో స్థానం పొందుతానని ఆశించాడు. ఇతడితోపాటు మరో ఇద్దరికి కూడా చోటు లభిస్తుందనుకున్నారు. ఆ అవకాశం రాకపోవడంతో 33 ఏళ్ల వయస్సులోనే క్రికెట్కు వీడ్కోలు చెప్పాశాడు. ఆ వెంటనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) లో కీలక పదవులు చేపట్టాడు. జాగర్లమూడి నరేంద్రనాథ్ సహకారంతో జేకేసీ కళాశాలలో ఆంధ్రా ఉమెన్సు క్రికెట్ అసోసియేషన్ స్థాపించాడు. ఇక్కడే కోచింగ్ క్యాంపు ప్రారంభింపచేశారు. ఇతడి ఆలోచనలకు రూపుఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ జేకేసీ కళాశాల గ్రౌండ్స్ని సందర్శించి ఇదొక రోల్మోడల్ అని కితాబిచ్చారంటే దానివెనక ఎమ్మెస్కే కఠోరశ్రమ ఎంతవుందో అంచనా వేయొచ్చు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజుతో ఇతడికి సాన్నిహిత్యం పెరిగింది. రికీ భుయ్ వంటి వర్థమాన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. గంగరాజుతో సాన్నిహిత్యం మేలు చేసింది. సెలెక్షన కమిటీ చైర్మన్ పదవికి ముందే సెలెక్టర్గా ఎంపికయ్యాడు. ఏదో ఒక రోజు సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. అయితే ఇతడి కంటే సీనియర్ క్రికెటర్లు ఉన్నప్పటికీ 2016 సెప్టెంబరులో ఇతడిని బీసీసీఐ సెలెక్షన కమిటీ చైర్మన్ గా నియమించింది.[2]
మూలాలు
- ↑ http://www.sportstarlive.com/cricket/indian/m-s-k-prasad-huge-responsibility-i-will-do-my-best/article7861782.ece
- ↑ 2.0 2.1 2.2 2.3 "ఆ క్యాచ్ లు అలా పట్టేశా : ఎమ్మెస్కే ప్రసాద్". andhrajyothy.com. 2017-01-02. Retrieved 2017-01-02.