"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కుందకుందాచార్యుడు
Contents
పరిచయం
కుందకుందాచార్యుడు తెలుగు వాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది. ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది... సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది. .ఈయన జైనమత సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..
కొనకొండ్ల గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఈయనను కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు. ప్రాచీన జైన సంప్రదాయాల్లో కొండకుందాన్వయం ఒకటి.
ఈయనకు గల ఇతరపేర్లు : వక్రగ్రీవుడు (ఈయనకు మెడకొంచెం వంకరగా ఉండేదట), గ్రద్ద పింఛుడు (గద్ద ఈకలపింఛాన్ని చేతపట్టుకుని ఉండేవాడు), ఏలాచార్యుడు.
క్రీస్తుపూర్వం 40 ప్రాంతంలో పుట్టినాడని, క్రీ.శ. 44 లో కైవల్యం పొందినట్టుగా చెప్తారు. అంటే సుమారు 85 ఏండ్లు జీవించినట్టుగా తెలుస్తున్నది. దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు. ఈయన శిష్యుల్లో ముఖ్యులు: బలాక పింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు.
రచనలు
కుందకుందాచార్యుడు మహాపండితుడు. సమయాచారం, ప్రవచనసారం, పంచాస్తికాయసారం అనే సారత్రయ గ్రంథాలను, నయమసారమనే 8 గ్రంథాల సంకలనాన్ని, రయనసారం, అష్టసాహుడు, బరసానువాకం, దశభక్తి, మూలాచారం అనే గ్రంథాలను రచించాడు. వీటిలో మూలాచారం జైన సాంప్రదాయంలో అత్యంత ప్రాచీన ప్రామాణిక గ్రంథం.
ప్రాముఖ్యత
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.ఆయన శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు. అన్ని జైనసభలలోనూ ప్రారంభంలో చదివే మంగళా శాసనంలోఆయన పేరు కనపడుతుంది.
- మంగళం భగవాన్ వీరో
- మంగళం గౌతమో గణిన్
- మంగళం కుందకుందార్యో
- జిన ధర్మోస్తు మంగళం....
మహావీరుడు, గౌతములతో పాటు ఒక్క కుందకుందార్యుణ్ణే స్మరిస్తూ స్తుతిస్తారు. కొనకొండ్లను కొండకుందేయ తీర్థం అని కూడా అంటారు.. మూలసంఘానికి అధ్యక్షత వహించిన ఆచార్యులలో భద్రబాహుని అనంతరం నాలుగవ ఆచార్యుడు కొండకుంద... 52 సంవత్సరాలు ఆచార్య పదవినలంకరించినట్లు జైన సాంప్రదాయం తెలుపుతున్నది. ఈయన బలాత్కార గణాన్ని, సరస్వతీగచ్ఛ (వక్రగచ్ఛ) లను స్థాపించారు.. కుందకుందాచార్యుని ఇతర శిష్యులు ఆంధ్రదేశంలోని పలు చోట్లలో మూలసంఘ శాఖలు విస్తరింపజేశారు.
మూలాలు, వనరులు
- తెలుగు దినపత్రికలు
- తెలుగు అకాడమి ప్రచురణలు