"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కోట సామ్రాజ్యము
|
చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గుంటూరు జిల్లా), యనమదల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండి సుమారు 150 సంవత్సరాల పాటు పాలించారు. వీరు ధనుంజయ గోత్రీకులని వారి బిరుదు గద్యము చెబుతున్నది. ఇప్పటికీ ధనుంజయ గోత్రం క్షత్రియ రాజుల్లో ఉన్నది.
విశేషాలు
కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనందకవి (జీవించిన కాలము క్రీస్తుశకం 1700) తాను వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమకృష్ణ వంశీకుడు, జమీందారు అయిన దాట్ల వెంకటకృష్ణమరాజును కీర్తిస్తూ, హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది [1]. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది.
కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:
- భీమరాజు 1 - క్రీస్తు శకం 1108-1127
- బేతరాజు 2 - క్రీస్తు శకం 1127-1148
- బేతరాజు 3 - క్రీస్తు శకం 1148-1156
- భీమరాజు 2 - క్రీస్తు శకం 1156-1188
- కేత రాజు 1 - క్రీస్తు శకం 1182-1231 - ఇతడు కాకతీయ గణపతి దేవుడి రెండవ కుమార్తె గణపాంబను వివాహమాడాడు.
- భీమరాజు 3 - క్రీస్తు శకం 1231-1234
- కేతరాజు 2 - క్రీస్తు శకం 1234-1240
- గణపతిదేవ - క్రీస్తు శకం 1240-1262
- భీమరాజు 4 - క్రీస్తు శకం 1262-1268
- దేవరాజు - క్రీస్తు శకం 1268
ఇతర విషయములు
కోట రాజులు ఈ క్రింది బిరుదు గద్యమును ఉత్సవ సందర్భాల్లో ఉచ్చరించేవారు:
స్వస్తి సమస్త పంచ మహా శబ్ద మహామండలేశ్వర| రాజ పరమేశ్వర| ఈశ్వర పదవీ విరాజమాన| విజయవినోద| .... మల్ల చోళ సింహ చోళ, శార్దూల| మత్త మాతంగ| హరిరాయాస్తాన గజసింహ| బౌద్ధకండకుద్దాల| పాండియరాయమగ| ధనుంజయ గోత్ర పవిత్ర| ... రాజు పేరు జగమొచ్చు గండండు| బంటు పేరు పగమెచ్చు గండండు| ఖడ్గం పేరు కాలమృత్యువు| రేవు పేరు పాప వినాశనంబు| నదిపేరు కృష్ణవేణి| దేవర పేరు అమరేశ్వర దేవుండు| పట్టణంబు పేరు ధరణాల కోట| వాటి పేరు ధన్య వాటి| వీటి పేరు గండరగండ వీడు| పడగ పేరు గండభేరుండ| .... అంబ దేవర భూపాలుండు మొదలైన శ్రీ కోట రాజుల అన్వయ ప్రశస్తి| విజయీభవ| దిగ్విజయీభవ !! [2].
మూలాలు
ఇంకా చదవండి
లంకెలు
- http://en.wikipedia.org/wiki/Kota_Vamsa
- http://archive.org/stream/vijayanandavilas026061mbp#page/n23/mode/1up
- https://archive.org/details/vijayanandavilas026061mbp/page/n3
- http://www.archive.org/stream/studiesinsouthin00ramarich
- http://openlibrary.org/books/OL7097356M/Studies_in_South_Indian_Jainism